అమెరికా వెళ్లేవారికి అలర్ట్‌: కొత్త ఫీజులు రేపటి నుంచే..

Thank you for reading this post, don't forget to subscribe!

  • మెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్‌ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది.
  • వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్‌-1బీ (H-1B), ఎల్‌-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది.

8 ఏళ్ల తర్వాత పెంపు

  • అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) పేర్కొంది.

వీసా కొత్త ఫీజులు ఇలా..

  • కొత్త హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్‌1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది.
  • ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్‌-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు.
  • అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి.