ఆర్థిక సంవత్సరం.. జనవరి నుంచి స్టార్ట్ అవ్వొచ్చుగా, ఏప్రిల్ నెలే ఎందుకు?

Thank you for reading this post, don't forget to subscribe!

ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు.

దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.

బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం
బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.

వ్యవసాయ దేశం
భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.

పండుగలు
భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్‌లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

ప్రాంతీయ నూతన సంవత్సరం
భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.

ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ”కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్” దేశాలు కూడా ఉన్నాయి.